తెలంగాణ రాష్ట్ర కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

1992 బ్యాచ్‌కు చెందిన సంజయ్‌ జాజు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఇటీవలే కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ  ఆయన్ను పేరెంట్‌ కేడర్‌కు బదిలీ చేసింది. మూడు రోజుల క్రితం ఆయన కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్‌ అయ్యారు.

ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న కే. రామకృష్ణారావు పదవీకాలం ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సంజయ్‌ జాజును రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.