ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఒక వృద్ధుడి విషయంలో నిర్లక్ష్యంగా, అమర్యాదగా వ్యవహరించిన కానిస్టేబుల్‌పై తాజాగా సస్పెన్షన్ వేటు పడింది. రాజస్థాన్‌లోని దుంగర్‌పూర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇటీవల స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ఒక వృద్ధుడు వెళ్లారు. అయితే, ఆయన ఫిర్యాదు తీసుకునే విషయంలో ఆ కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలిసింది. ఎదురుగా ఉన్న టేబుల్‌పై కాళ్లు పెట్టుకుని కానిస్టేబుల్ కూర్చున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎదురుగా పెద్దాయన కూర్చున్నప్పటికీ పట్టించుకోకుండా అమర్యాదకరంగా ఆమె వ్యవహరించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. వృద్ధుడు స్టేషన్‌లో ఉన్న సమయంలోనే ఎవరో ఫొటో తీసి నెట్టింట పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఉదంతంపై విమర్శలు వెల్లువెత్తడంతో రాజస్థాన్ పోలీసులు స్పందించారు. విషయం తమ దృష్టికి రాగానే మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామని చెప్పారు. కానిస్టేబుల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎక్స్ వేదికగా వెల్లడించారు.