దక్షిణ ఫిలిప్పీన్స్లోని మిండనావో ప్రాంతంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం, శుక్రవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో ఈ శక్తివంతమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో భయాందోళనకు గురైన తీరప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి, ముందుజాగ్రత్త చర్యగా ఎత్తైన ప్రదేశాలకు పరుగులు తీశారు.
అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్), జర్మన్ రీసెర్చ్ సెంటర్ (జీఎఫ్జెడ్) నివేదికల ప్రకారం, దవావో రీజియన్లోని సారంగానికి 34 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో సుమారు 42 నుంచి 52 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం ధాటికి దవావో నగరంలోని భవనాలు కంపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అయితే, ఈ భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.
ఇదే ప్రాంతంలో జూన్ 8వ తేదీన 7.8 తీవ్రతతో సంభవించిన పెను భూకంపం నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే తాజాగా మరోసారి ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇటీవలి విపత్తు కారణంగా 81 మంది ప్రాణాలు కోల్పోగా, 1,300 మందికి పైగా గాయపడ్డారు. సుమారు 16 లక్షల మంది ఈ ఘటనతో ప్రభావితులయ్యారు. పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' జోన్లో ఉన్న ఫిలిప్పీన్స్లో ఇటువంటి భూకంపాలు సంభవించడం సర్వసాధారణం.
ఫిలిప్పీన్స్లో మరో భారీ భూకంపం...
