సోమాలియా సముద్ర తీర ప్రాంతాల్లో సముద్రపు దొంగల ఆగడాలు మరోసారి పెరిగాయి. ఏడెన్ గల్ఫ్, ఆఫ్రికా తీర ప్రాంత జలాల్లో పైరేట్లు జరిపిన వేర్వేరు హైజాక్‌లలో మొత్తం 16 మంది భారత నావికులు బందీలుగా చిక్కుకున్నారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (డీజీఎంఏ) అధికారికంగా ధ్రువీకరించింది.

ఈ ఏడాది ఏప్రిల్ 24 నుంచి జులై 17 మధ్య కాలంలో ఈ నౌకలను హైజాక్ చేశారు. చివరగా జులై 17న ఏడెన్ గల్ఫ్‌లో ఎంటీ అసానా అనే నౌకను హైజాక్ చేశారు. అందులోని 22 మంది సిబ్బందిలో 11 మంది భారతీయులు ఉన్నారు. ఈ నౌక ప్రస్తుతం సోమాలియా వైపు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు, మే 2న ఎంటీ యూరేకా, ఏప్రిల్ 24న ఎంటీ హానర్ నౌకలను కూడా పైరేట్లు అపహరించారు. ఈ రెండు నౌకల్లో కలిపి ఐదుగురు భారతీయులు ఉన్నారు.

అయితే, సిబ్బంది అప్రమత్తతతో వ్యవహరించడం వల్ల ఒక నౌక హైజాక్ నుంచి సురక్షితంగా బయటపడింది. జులై 1న ఎంవీ గోల్డెన్ ఆర్సెనల్ నౌకపై పైరేట్లు దాడికి యత్నించగా, సిబ్బంది వెంటనే షిప్ సెక్యూరిటీ ప్లాన్‌ను అమలు చేసి, 'సిటాడెల్' అనే సురక్షిత గదిలోకి వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఇండియన్ నేవీకి సమాచారం అందించడంతో, వెంటనే రంగంలోకి దిగిన నౌకాదళం హెలికాప్టర్‌ను పంపింది. నేవీ రాకను గమనించిన దొంగలు పరారయ్యారు.

ఈ వరుస ఘటనల నేపథ్యంలో ఏడెన్ గల్ఫ్, పరిసర ప్రాంతాల్లో సముద్ర ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారిందని డీజీఎంఏ హెచ్చరించింది. నౌకలు ప్రయాణానికి ముందు తప్పనిసరిగా భద్రతాపరమైన రిస్క్ అంచనా వేసుకోవాలని, 'బెస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్’ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించింది. దాడి జరిగినప్పుడు సిబ్బంది వెంటనే సిటాడెల్‌లోకి వెళ్లి సాయం కోసం సమాచారం అందించాలని స్పష్టం చేసింది. హై-రిస్క్ ఏరియాలో ప్రయాణించే నౌకల యజమానులు, మాస్టర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని గట్టిగా సూచించింది.