కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో తన సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినప్పటికీ, స్వర్ణాన్ని అందుకోలేకపోయాడు. శ్రీలంకకు చెందిన ఆర్.టి. పతిరగే సంచలన ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే ఈవెంట్‌లో భారత్‌కు చెందిన యశ్‌వీర్ సింగ్ కాంస్యం గెలుచుకోవడంతో ఒకే ఈవెంట్‌లో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి.

సోమవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా 85.83 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. తన రెండో ప్రయత్నంలోనే అతడు ఈ మార్కును అందుకున్నాడు. అయితే, శ్రీలంక అథ్లెట్ పతిరగే 89.75 మీటర్ల దూరం విసిరి అందరినీ ఆశ్చర్యపరిచి స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోయాడు. ఇది నీరజ్‌కు రెండో కామన్వెల్త్ పతకం. 2018 గోల్డ్ కోస్ట్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్.. గాయం కారణంగా 2022 క్రీడలకు దూరమయ్యాడు.

ఈ పోటీలో మరో భారత అథ్లెట్ యశ్‌వీర్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. తన చివరి ఆరో ప్రయత్నంలో 85.41 మీటర్లతో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. నీరజ్‌కు కేవలం 42 సెంటీమీటర్ల దూరంలో నిలిచాడు. యశ్‌వీర్ చివరి ప్రయత్నానికి ముందు పతకం రేసులో లేకపోయినా, ఒక్కసారిగా మూడో స్థానానికి దూసుకొచ్చాడు.

పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 77.41 మీటర్లతో నిరాశపరిచి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరో భారత క్రీడాకారుడు రోహిత్ యాదవ్ 81.56 మీటర్లతో ఏడో స్థానంలో నిలిచాడు. ఈ రెండు పతకాలతో భారత్.. పతకాల పట్టికలో మొత్తం 23 పతకాలతో (5 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్యాలు) పదో స్థానానికి చేరింది.