ఏపీలో త్వరలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నట్లు ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. కనెక్టివిటీ, వాణిజ్యం, పర్యాటకాన్ని పెంపొందించేలా ఈ విమానాశ్రయాన్ని ఆధునికంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. సుస్థిరత, ఇంధన సామర్థ్యం వంటి అంశాలకు ఇందులో ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఈ పర్యటనలో భాగంగా ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు, కర్నూలు-IV పునరుత్పాదక ఇంధన జోన్‌కు సంబంధించిన ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు కూడా శంకుస్థాపన చేయనున్నట్లు ప్రధాని తన ట్వీట్‌లో వివరించారు. వీటితో పాటు పూర్తయిన పలు కీలక జాతీయ రహదారి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ఎన్‍హెచ్-365బీజీపై రేచెర్ల - గురువాయిగూడెం, గురువాయిగూడెం - దేవరపల్లి మధ్య నాలుగు వరుసల రహదారులు, ఎన్‍హెచ్-67పై నిర్మించిన తాడిపత్రి బైపాస్ ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రధాని ట్వీట్‌కు చంద్రబాబు రిప్లై
ప్రధాని మోదీ చేసిన ఈ పోస్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ ఆయన రీపోస్ట్ చేశారు. "భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి టేకాఫ్‌ తీసుకుంటుంది" అని చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.