మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' చిత్రంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సినిమాను రామ్ చరణ్ తన భుజస్కందాలపై మోశారని ఆయన ప్రశంసించారు. అయితే, అదే సమయంలో చిత్రంలోని కొన్ని కీలక లోపాలను కూడా ఆయన ఎత్తిచూపారు. ముఖ్యంగా సినిమా నిడివి ఎక్కువగా ఉండటం, కథానాయిక పాత్ర పరిమితంగా ఉండటం ప్రధాన మైనస్లుగా ఆయన పేర్కొన్నారు.
తన 'పరుచూరి పాఠాలు' సిరీస్లో భాగంగా ఆయన ఈ విశ్లేషణ చేశారు. ఓటు హక్కు లేని ఒక గ్రామానికి రైలు ఆగేలా చేసి, ఆ ఊరికి గుర్తింపు తీసుకురావాలనే ఒక చిన్న పాయింట్తో మూడు గంటలకు పైగా కథగా చెప్పడం సాహసమేనని ఆయన అభిప్రాయపడ్డారు. "రామ్ చరణ్ కాకుండా మరెవరైనా హీరోగా నటించి ఉంటే, ఈ స్థాయి ఫలితం వచ్చేది కాదేమో. తన నటనతో సినిమాను అతడే నడిపించాడు. చిత్ర వసూళ్లకు అతడే ప్రధాన కారణం" అని పరుచూరి స్పష్టం చేశారు. అలాగే జగపతి బాబు నటన, ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం బాగున్నాయని కొనియాడారు.
కాగా, చిత్రంలోని లోపాలను కూడా పరుచూరి వివరించారు. హీరో హీరోయిన్ల ఆహార్యం, వేషధారణ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేవని, వారు కొండ ప్రాంతవాసుల్లా కనిపించారని పేర్కొన్నారు. కథలో హీరోయిన్ పాత్రకు తగిన ప్రాధాన్యత లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా రన్టైమ్ను కనీసం 30 నుంచి 40 నిమిషాల వరకు తగ్గించి ఉంటే బాగుండేదని సూచించారు.
నిడివిని తగ్గించి, హీరోయిన్ పాత్రను మరింత పెంచి ఉంటే ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యేదని ఆయన అన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించారు.
రామ్చరణ్ 'పెద్ది' ప్లస్సులు, మైనస్సులు ఇవే: పరుచూరి గోపాలకృష్ణ..
