రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో యువకులు కారుతో ఢీకొట్టడంతో పీజీ వైద్య విద్యార్థిని బ్రెయిన్ డెడ్ అయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, వారికి చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా చూడాలని స్పష్టం చేశారు. బాధితురాలు డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఆమెకు అవసరమైన అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని సూచించారు.
శుక్రవారం అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఈ ఘటనపై సమీక్ష నిర్వహించారు. ఘటన జరిగిన తీరును, నిందితుల అరెస్టు వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మెడికోలు ప్రియాంక, ఉమేష్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని అధికారులు తెలపగా, విచారణ వేగవంతం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.
అసలేం జరిగిందంటే..
రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు మాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్తో పరీక్షించి వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన నామవరం ప్రాంతానికి చెందిన సూర్యవరపు దశవంత్ అలియాస్ యశ్వంత్, అతని స్నేహితుడు జోసెఫ్ తమ కారులో వేగంగా బయటకు దూసుకెళ్లారు.
అదే సమయంలో మాల్ గేటు వద్ద స్కూటీపై వెళుతున్న జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థులు డాక్టర్ ప్రియాంక, డాక్టర్ ఉమేష్లను వారి కారుతో ఉద్దేశపూర్వకంగా పలుమార్లు ఢీకొట్టారు. ఈ దాడిలో స్కూటీపై వెనుక కూర్చున్న ప్రియాంక కిందపడిపోగా, ఆమె తలపై నుంచి కారును పోనివ్వడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఉమేష్కు కూడా గాయాలయ్యాయి.
స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం, ప్రియాంకను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. అయితే, తలకు బలమైన గాయం కావడంతో ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు తొలుత భారతీయ న్యాయ సంహిత కింద పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. అయితే, దాడి తీవ్రత దృష్ట్యా హత్యానేరం వంటి కఠినమైన సెక్షన్లను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ అమానవీయ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా వైద్య వర్గాలు, ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
రాజమండ్రి హిట్ అండ్ రన్ ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష..
