మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత్రి సునేత్ర పవార్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పరిణామంపై అధికార మహాయుతి కూటమిలోని బీజేపీ స్పందించింది. కూటమిలో అనుమానాలకు, విభేదాలకు తావిచ్చే చర్యలకు పాల్పడవద్దని మిత్రపక్షమైన ఎన్సీపీకి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది.

ముంబైలోని సునేత్ర పవార్ అధికారిక నివాసం 'దేవగిరి'లో గురువారం ఈ భేటీ జరిగింది. ఆమె కుమారుడు, ఎన్సీపీ నేత పార్థ్ పవార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గంటల తరబడి సాగిన ఈ చర్చల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై మంతనాలు జరిపినట్లు ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది జనవరిలో తన భర్త, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత సునేత్ర పవార్, ప్రశాంత్ కిశోర్‌తో భేటీ కావడం ఇది రెండోసారి.

ఈ భేటీపై మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ బవాన్‌కులే స్పందించారు. "కూటమిలో చీలికలు తెచ్చే ఎలాంటి చర్యలకు పూనుకోవద్దు" అని ఆయన హితవు పలికారు. ఇది ఎన్సీపీ అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ, మహాయుతిలోని భాగస్వామ్య పక్షాలన్నీ కూటమి ధర్మానికి కట్టుబడి ఉండాలని, మిత్రపక్షాలను ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల బీహార్‌లోని బంకిపుర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ విజయం సాధించడం గమనార్హం. గత మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకిపూర్ నియోజకవర్గంలో ప్రశాంత్ కిశోర్ గెలుపొందిన నేపథ్యంలో, ఈ భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపైనే చర్చించినట్లు ఎన్సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.